భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహణ – 47వ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాలకు శ్రీకారం

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహణ – 47వ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాలకు శ్రీకారం
హైదరాబాద్: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 47వ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా సమితి కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి హిందువుల ఐక్య వేదిక అని పేర్కొన్నారు. గణేష్ మండపాలకు సంబంధిత అధికారులు సకాలంలో అనుమతులు మంజూరు చేసి, ఉత్సవాల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సహకరించాలని కోరారు. అలాగే “జన్ జి గణేష్ జీ వైపు వెళ్లాలి” అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
సమితి ప్రధాన కార్యదర్శి డా. రావి నూతల శశిధర్ మాట్లాడుతూ, భారతదేశ ఔన్నత్యాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడిన మహనీయులను స్మరించుకున్నారు. యువత హిందూ ధర్మ పరిరక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు. దేశభక్తి, సంస్కృతి, మహనీయుల స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించే ఉద్దేశంతో గణేష్ మండపాల వద్ద భారతదేశం మరియు హిందూ ధర్మాన్ని రక్షించిన మహనీయుల చిత్రపటాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే 150వ ‘వందేమాతరం’ జాతీయ గీత ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ పాల్గొని, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమం ముగింపులో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సమితి నాయకులు, వివిధ గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










